భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) భద్రాచలం డివిజన్ కార్యదర్శిగా కల్లూరి వెంకటేశ్వరరావు ఎన్నికైనారు. బుధవారం భద్రాచలంలో జరిగిన డివిజన్ స్థాయి సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. గతంలో రెండుసార్లు డివిజన్ కార్యదర్శిగా ఎన్నికైన కల్లూరి పార్టీకి ఎనలేని సేవలు చేశారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర సమితి సభ్యులుగా, గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా బాధ్యులుగా కొనసాగుతున్నారు. మరోసారి పార్టీ డివిజన్ కార్యదర్శి బాధ్యతలను ఆయనకు అప్పగించింది. ఈ సందర్భంగా కల్లూరి మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సిపిఐని గ్రామ గ్రామాన విస్తరింప చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. డివిజన్ వ్యాప్తంగా సిపిఐ వందేళ్ళ జయంతి వేడుకలు నిర్వహించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. తన నియామకానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ భాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య, ములుగు జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యలు రావులపల్లి రవికుమార్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.










