– అంచనాలకు మించి హాజరైన గులాబీ శ్రేణులు
– నాయకుల్లో రెట్టింపైన ఉత్సాహం
– కార్యకర్తలను పరుగులు పెట్టించేలా నాయకుల ప్రసంగాలు
– ఆద్యంతం చప్పట్లతో మారుమ్రోగిన సభాప్రాంగణం
విజయపతాక పొలిటికల్ రిపోర్ట్
చర్లలో బిఆర్ఎస్ పార్టీ ఆదివారం నిర్వహించిన మండల

సమావేశం నాయకుల అంచనాలకు మించి విజయవంతమైంది. దీంతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన పార్టీ కన్వినర్ దొడ్డి తాతారావు, కో కన్వినర్ ఐనవోలు పవన్ కుమార్సహా ఇతర ముఖ్య నాయకుల కృషిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు అభినందించారు. నాయకులు అంతా ఇదే సమన్వయంతో పనిచేస్తే పార్టీ మొదటి స్థానంలో నిలిచి గ్రామపంచాయతీ, ఎంపిటిసి, జడ్పిటిసి సహకార సంఘాల ఎన్నికల్లో విజయ దుందుభి మ్రోగిస్తుందని చర్ల మండల నాయకత్వానికి రేగా పలు సూచనలు చేశారు. సమావేశానికి భారీగా హాజరైన గులాబీ శ్రేణులను చూసి రెట్టింపు ఉత్సాహంతో నాయకులు ప్రసంగాలు చేసి కేడర్లో జోష్ నింపారు. కెసిఆర్ నాయకత్వంలోని గత పదేళ్ళ పాలన సూపర్ హిట్.. రేవంత్ రెడ్డి ఏడాది పాలన అట్టర్ ప్లాప్ అంటూ నాయకులు ఆనాటి, నేటి పథకాలను పోల్చుతూ ప్రసంగాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వేలెత్తి చూపినపుడు సభాప్రాంగణం ఆద్యంతం చప్పట్లతో మారుమ్రోగింది. జై కెసిఆర్.. భద్రాద్రి టైగర్ రేగా నాయకత్వం వర్థిల్లాలని కేడర్ పెద్దపెట్టున నినాదాలు చేయడం ఈ సభ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపిందనడానికి నిదర్శనం. ఆడ బిడ్డలకు ఇచ్చిన తులం బంగారం హామీ నిలబెట్టుకోవడానికి లంకె బిందెల కోసం రేవంత్ రెడ్డిసహా ఎమ్మెల్యేలు అంతా వెతుకుతున్నారని…అలాగే భద్రాచలం నియోజకవర్గంలో చెత్త నాయకత్వం అంతా వలస పోయిందని నాయకులు తమ ప్రసంగాల్లో అన్నప్పుడు సభాప్రాంగణం చప్పట్లతో దద్దరిల్లింది. కార్యకర్తల చప్పట్లు, నినాదాలే నాయకుల ప్రసంగాలకు ఊపునిచ్చాయని చెప్పవచ్చు.










