రాబోవు 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఇల్లందు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు దొడ్డ డానియల్ అధ్యక్షతన నిర్వహించిన ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ, పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి చేసిన అప్పులను ఎగనామం పెట్టారన్నారు. వీటన్నింటిని సరి చేసుకుంటూ గత ప్రభుత్వ అప్పులను వడ్డీలను చెల్లిస్తూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలో అమలు చేస్తూ ముందుకు సాగుతుంటే ఓర్వలేని బిఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎవరిని ఆరోపణ చేసిన అవమానాలు చేసిన ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అన్ని సంక్షేమ పథకాలను వచ్చే నాలుగేళ్లలో అందజేసి మరో 10 ఏళ్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగే విధంగా పాలన చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళిక రూపొందించారని అన్నారు.










