
ఈనెల 9, 10 తేదీలలో జరగనున్న తెప్పోత్సవం, వైకుంఠ ద్వారదర్శన ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఈ రోజు భద్రాచలంలోని ఏఎస్పీ కార్యాలయం నందు గల కాన్ఫరెన్స్ హాలులో సెక్టార్ల వారీగా కేటాయించబడిన అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి పలు సూచనలు చేశారు. అత్యంత వైభవంగా జరగనున్న తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శన ప్రదేశాలలో విధులు నిర్వర్తించే అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.1300 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ రెండు రోజులపాటు భద్రాచలం పట్టణంలో జరిగే ఉత్సవాలకు పోలీసు వారు సందర్భానుసారంగా విధించే ఆంక్షలకు ప్రజలు సహకరించాలని కోరారు.










